చింతు

డిసెంబరు 21, 2007

ప్రియ వసంతమా…!

ప్రచురించిన వర్గము ఉస్తాద్ సుల్తాన్ ఖా, చిత్ర, నౌహీద్ సైరస్ — Dr.Ismail Penukonda @ 3:34 పూర్వాహ్నం

అతడు:

ప్రియ వసంతమా!

ఎందుకిలా వేధిస్తావు…

తొందరగా రావూ…!

ఏం మాయ చేశావో కానీ…

నా ప్రేమ రాగాన్ని మీటావు.

ఆమె:

ఎందుకిలా వేధిస్తావు…

ప్రియ వసంతమా…తొందరగా రావూ…!

అతడు:

ఈ మేఘచాపం….

రెపరెపలలాడుతూన్న భూదేవి కొంగు సింగారం.

ఈ ఆకులూ, ఈ పొదలూ…

ఎంత అలజడి రేపుతున్నాయో నా మదిలో.

ఊగిసలాడుతున్న నా మనస్సుకు…

ఏం చెప్పాలో తెలియకున్నది.

ఆమె:

నా మదీ వినకున్నది…

నీ దాన్ని నేనే నన్నది.

ఎందుకిలా వేధిస్తావు…తొందరగా రావూ…!

రాబోయే కలలన్నీ…కనురెప్పల మీద కూర్చొన్నాయి…

గుండె ముళ్లన్నీ విప్పుకొన్నాయి…మదిలో ప్రేమ భావనలు పురివిప్పాయి!

సప్తవర్ణాల స్వప్నాలు స్వాగతిస్తున్నాయి…

ఎందుకిలా వేధిస్తావు…తొందరగా రావూ…!

అతడు:

ఏం మాయ చేశావో కానీ…నా ప్రేమ రాగాన్ని మీటావు…

ప్రియ వసంతమా! ఎందుకలా వేధిస్తావు…త్వరగా రావూ…!

ఆమె:

అవును…ఎందుకలా వేధిస్తావు…తొందరగా రావూ…!!!

గానం: ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ & చిత్ర.

తెలుగు బ్లాగులో హిందుస్థానీ పాటేమిటని ఆశ్చర్యపోతున్నారా? నాకెంతో ఇష్టమైన పాట ఇది. అవడానికి హిందీ లలిత సంగీతమైనా, సంగీతానికి భాష లేదు కదా! అందుకే ఇలా. అన్నట్టు నాకు తోచినంతలో పాట సాహిత్యాన్ని తెలుగులో అనువదించాను కానీ…అసలు భావం పాట వింటే మీకే తేలిగ్గా అర్థమవుతుంది (కల్హర గారో, రాధిక గారో నిజమైన కవిత రూపంలో అనువదిస్తే ఇంకా బావుంటుంది). ‘చిత్ర’ గాన మాధుర్యం, ‘ఉస్తాద్’ మంద్ర గంభీర కంఠం, కంటికింపైన పచ్చని ప్రకృతి, గాఢమైన నీలిమ, అమాయక పుష్ప సౌందర్యం, అన్నిటికీ మించి ‘నౌహీద్ సైరస్’ భీత హరిణేక్షణ చూపులూ, కంటి విరుపులు, నొసటి నాట్యాలూ, ఓహ్…ఇవన్నీ ఈ పాటకు వన్నెలద్దాయి. చూసి, విని, అనుభవించి…పలవరించండి! – బ్లాగర్లకందరికీ బక్రీదు శుభాకాంక్షలు.

డిసెంబరు 16, 2007

హీరోలు, వైద్యులు, ఇద్దరు అమ్మాయిలు

ప్రచురించిన వర్గము ఇద్దరు అమ్మాయిలు, వైద్యులు, హీరోలు — Dr.Ismail Penukonda @ 5:12 అపరాహ్నం

హీరోలనగానే మనకు గుర్తొచ్చేది సినిమా హీరోలే! కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఆ హీరోల గురించి కాదు నిజజీవితపు హీరోల గురించి. చాలా రోజుల కిందటే “సి.ఎన్.ఎన్. హీరోస్” అని ఆ ఛానల్ ఓ పోటీ పెట్టింది. మనకు తెలిసిన హీరోల గురించి వారికి సమాచారమిస్తే వారు, న్యాయనిర్ణేతలు ఓ ఆరు హీరోలను ఎంపిక చేస్తారు. అందులో చివరి వరకు వచ్చిన వారిలో మన అయ్యకుడికి చెందిన ఎస్.రామకృష్ణన్ కూడా ఉన్నారు. నా వంతుగా తమకు చేతనైన కృషి చేస్తూ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతూన్న ‘టుమేక్ ఎ ఢిఫరెన్స్’ ప్రశాంతి గారి గురించి ఈ పోటికి సిఫార్సు చేసాను. చిన్న చిన్న అడుగులే ఓ మహా ప్రస్థానానికి కారణభూతమవుతాయి.

ఈ హీరోల్లో నేను ప్రత్యేకంగా ప్రస్తావించదలచుకొన్న వ్యక్తి కెన్యాకు చెందిన ‘పీటర్ కిటానే’. పన్నెండేళ్ల ప్రాయంలో ఏదో తెలియని జబ్బుతో ఇద్దరు తల్లిదండ్రులు, ఆరుగురు తోబుట్టువులు అసువులుబాస్తే అనాథగా మిగిలిన ఈ కుర్రాడు, తోటి బంధువులు-స్నేహితులు వద్దన్నా వినకుండా చదువును వదిలిపెట్టకుండా, కష్టపడి ఓ మంచి ఉన్నత పాఠశాలలో స్థానం సంపాదించి, చివరకు అమెరికాలోని సియాటిల్లోని కళాశాలలో చేరాడు. అంతటితో తన జీవితానికి ఓ ఆధారం దొరికిందని ఊరుకోకుండా, తన వాళ్లకు ఏదైనా చేయాలనే తపనతో సొంతూరులో “మామా మారియా క్లినిక్” స్థాపించి వైద్య సదుపాయాల్లేని ఆ ఊరి ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్నాడు. ఎయిడ్స్ రోగ బాధితుల కోసం మరో పెద్ద క్లినిక్ నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నాడు. ఇతను నా హీరో. నా స్ఫూర్తి ప్రదాత.

* * *

గత కొన్ని రోజులుగా ఆంధ్రదేశంలో జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న సమ్మెలు, మధ్యలో నలిగిపొతున్న అమాయక ప్రాణాల గురించి ఆలోచిస్తే…దాడులు కొత్త కావు, ఆ మాటకొస్తే సమ్మెలూ కొత్తేం కాదు. దీనికి కారణం కేవలం వైద్యులు, దాడి చేస్తున్న రౌడీమూక కాదు అసలు దోషి ‘వైద్య వ్యవస్థ’. ప్రతిదాన్ని ప్రవేటుపరం చేయాలని ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. కానీ మన ప్రజల్లో ఎంత మంది ఖరీదైన వైద్యాన్ని చేయించుకొనే స్థోమత కలిగి ఉన్నారో అందరికీ తెలుసు. ఏ రంగాన్ని ప్రైవేటీకరించినా విద్య, వైద్యం అందరికీ అందించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఏ కారణాల వల్లనైతేనేమి ఆ బాధ్యతల నుంచి తప్పుకోజూస్తూంది. సరైన మౌలిక వసతుల్లేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం వికటిస్తే ఆ నెపమంతా అక్కడి వైద్యుల పైనే పడుతుంది.

మొన్న జరిగిన వైద్య విద్యార్థిని పై దాడి కేసులో రోగి చనిపోవడానికి మూలకారణం ‘పల్మనరీ ఎంబాలిజం’ అనే సమస్య. ముందే ఆ అభాగ్యురాలి కడుపులో పిండం చనిపోయి కొద్దిరోజులవుతోంది. అలాంటప్పుడు మన శరీరంలో రక్తం గడ్డ కట్టే పరిస్థితి ఎదురవుతుంది. మనకు ఏదైనా గాయం తగిలితే కొద్ది సేపట్లోనే రక్తం గడ్డకడుతుంది. రక్తంలోని ‘ప్లేట్లెట్లు’ అనబడే కొన్ని కణాలు, ఇతరత్రా కారకాల వల్ల జరిగే ఈ ప్రక్రియ మన ప్రాణాలు కాపాడుతుంది. ఇదే శరీరంలో జరిగితే చాలా ప్రమాదకరం. పైన చెప్పిన ఈ కేసులో అలా జరగడానికి పిండం చనిపోవడం వల్ల, తల్లి రక్తంలో జరిగే మార్పుల వల్ల ఆస్కారం ఎక్కువ. అలా తయారైన రక్తపు గడ్డలు, రక్తనాళాల్లో ప్రయాణించి ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాలలో చిక్కకొని, మనకు ప్రాణాధారమైన ‘ఆమ్లజని’ (ఆక్సిజన్)ను అందకుండా చేస్తుంది, మరణానికి కారణమవుతుంది. ఇదంతా క్షణాల్లో జరగొచ్చు, అంటే రక్తపు గడ్డలు ఎక్కడో ఉండి, రక్తప్రవాహ వేగానికి ఉన్నట్టుండి ప్రవాహంలో చేరి ఈ ‘పల్మనరీ ఎంబాలిజం’ను కలిగించొచ్చు.

ఇవన్నీ చెబితే అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఆ రోగి బంధువులు ఉండాలిగా! ఏదేమైనా ఇలా ప్రతి చావుకు దాడి జరుపుకుంటూ పోతే ఇక వైద్యం చేయడానికి ఎవరూ మిగలరు. కొద్ది నెలల క్రితం కర్నూలులో ఇలాగే, తన తప్పులేకపోయినా, ఓ పి.జి.వైద్య విద్యార్థిపై యాసిడ్ తో దాడి చేసారు. ఇప్పుడతను కళ్లు కోల్పోయి ఇన్నేళ్లు చదివిన వైద్య వృత్తికి దూరంగా ఉన్నాడు. ఇలా ఎన్నో! ప్రభుత్వం ఇలాంటి వారి మీద కఠిన చర్యలు చేపట్టి, వైద్యుల్లో, వైద్య విద్యార్థుల్లో ధైర్యం నింపకపోతే అందరూ ఇతర చదువులకు మళ్లే ప్రమాదముంది.

* * *

సమాచార విప్లవం తెచ్చిన ఒరవడి వల్ల ఈ ఇద్దరు అమ్మాయిల గురించి చదివే అవకాశం కలిగింది. ఒకరు కుడివైపు గుండె కలిగి, గుండెలో రంధ్రం ఉండి శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తూన్న అభాగ్యురాలు, మరొకరు చేయూత అందిస్తే మరో పి.టి.ఉషలా దేశానికి పేరు తెచ్చే తెగువ ఉన్న తరుణీమణీ. చేతనైన సాయం నేను చేశాను, మీరు చేయండి ఇక్కడ.

ఒలింపిక్స్̍లో మనకు స్వర్ణ పతకాలు ఎందుకు రావంటే…?

ప్రచురించిన వర్గము ఒలింపిక్స్, పరుగుల రాణి, ప్రభావతి — Dr.Ismail Penukonda @ 5:06 అపరాహ్నం

డిసెంబరు 12, 2007

తెలుగు ప్రజా హృదయాధినేత!

ప్రచురించిన వర్గము ఆంధ్రప్రదేశ్, చిరంజీవి, రాజకీయాలు — Dr.Ismail Penukonda @ 2:35 పూర్వాహ్నం

తెలుగు ప్రజలకు చరిత్ర సృష్టించే మరో అవకాశం వచ్చింది. మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజానీకం తమ హృదయాంతరంగాన్ని అవలోకనాల్లో బహిర్గతం చేస్తోంది. పైనుంచి అంతా చిద్విలాసంగా గమనిస్తున్న తెలుగు ప్రజల ఆత్మబంధువు, మేరునగధీరుడు అయిన ‘అన్న’ గారు “చిరంజీవీ…తెలుగుదేశం* పిలుస్తోంది రా! కదలిరా!” అంటూ గీతోపదేశం చేస్తున్నారు. సమరానికి కాలు దువ్వడానికి సంకోచిస్తూన్న ఈ అర్జునుడి ప్రశ్నకు …

పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
“ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను.
ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి.”
ఆ కృష్ణుడి సమాధానం ఇది:
అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి
“ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయ్యావో,
దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలినవాడవైతావు.”
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి
“సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను
సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివికా.”
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి
“కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు.
కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు.”
ఇది నా కల. ఎన్నాళ్లగానో వేచిన సమయం ఆసన్నమయ్యింది. అడుగు ముందుకు వేసేందుకు తటపటాయిస్తున్న వీరార్జునుడికి కర్తవ్యం బోధించడానికి అన్నగారు కలలోనైనా కనబడి ఇలా అంటారనే ఓ చిరు ఆశ.
శోధన‘ సుధాకరుడన్నట్లు మన తెలుగు ప్రజలు వెర్రివెంగళప్పలేం కాదు. వందేళ్ల కాంగ్రెసును ముఖానికి రంగు పూసుకొనే ఓ నటుడు ఏం చేస్తాడులే అన్న ఆనాటి రాజకీయ దిగ్గజాల అంచనాలను తలక్రిందులు చేస్తూ తొమ్మిది నెలల పసివాడని పార్టీని అందలమెక్కించిన ఘనత వీరి సొంతం. అలా నెత్తిన పెట్టుకొన్న అదే పార్టీని, నిర్లక్ష్యం వహించిన దానికి ఐదేళ్ల తర్వాత నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి తమ రాణువను తెలియజేసిందీ వీరే. అలాగే సమకాలీన రాజకీయాల్లో తమ ప్రతాపం ఎలాంటిదో మళ్లీ చూపించారు. అయితే నుయ్యి, కాకపోతే గొయ్యిలా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఆసరా ఇచ్చే చెయ్యి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ శివశంకరుని ‘వర ప్రసాదాని’కై కాచుకు కూర్చొన్నారు.
కేవలం నటుడైనంత మాత్రాన ఆయన రాజకీయాల్లో రాకూడదనడం, నీ వంటి మంచి మనిషి ఈ రాజకీయ రొంపిలో దిగబడి బురద పూసుకోవడమెందుకు అని చాలా రోజులుగా అందరూ అంటూన్న మాట. అంటే మంచి వ్యక్తులు రాజకీయాలకు తగరా? సున్నిత మనస్కులు మంచి నాయకులు కాలేరా? నా వరకు దయ, సహానుభూతి ఉన్న వ్యక్తి వల్ల చాలా మందికి మంచి జరుగుతుంది. అలాగే నటుల్లో నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాయకులు పుట్టారు. ప్రపంచ చరిత్రను మలుపుతిప్పిన ‘రొనాల్డ్ రీగన్’ దగ్గరి నుంచి నేడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కెల్లా మంచి పరిపాలనాదక్షుడిగా పేరు గడించిన ‘ఆర్నాల్డ్ షార్జ్వ్నెగ్గర్’ వరకూ, తమిళనాట నీరాజనాలందుకొన్న ఎం.జి.ఆర్. దగ్గరి నుంచీ మన అన్న ఎన్.టి.ఆర్. వరకూ చరిత్రకు భాష్యం చెప్పినవారే.
ఇక ముఖ్యమంత్రి అయ్యే విషయాని కొస్తే, వచ్చే మొదటి ప్రశ్న చదువరి గారన్నట్టు “ఆంధ్ర దేశానికా? ఆంధ్ర ప్రదేశానికా?” అన్నది. తెలంగాణా మీద స్పష్టత లేకుండా ఎన్నికల బరిలో దిగే అవకాశం నాకు కనిపించడం లేదు. అందుకే గత టపాలో రెండు కుర్చీలు వేసింది అన్యాపదేశంగా ఈ విషయం దృష్టిలో ఉంచుకొనే! నా సొంత అభిప్రాయం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఉండడంలో తప్పేమీ లేదు. ప్రపంచం నలుచెరగులా వ్యాపించిన తెలుగు వారు వివిధ దేశాల్లో నివసిస్తూ మాతృభూమితో సంబంధాలు నెరుపుకోగా లేనిది, ఒకే దేశంలో పక్కపక్కన ‘తెలంగాణా’, ‘ఆంధ్రసీమ*’లనే రెండు రాష్ట్రాలుగా కలసి ఎందుకు ఉండలేరన్నది నా ప్రశ్న.
ఇక పొత్తులంటారా నా అభిప్రాయం ప్రకారం అవినీతి రహిత, ప్రజాభ్యుదయ ప్రభుత్వాన్ని అందించడానికి ‘డా.జయప్రకాశ్ నారాయణ్’తో కలవాలని, అప్పుడే ఈ పోరాటానికి ఓ గతి, లక్ష్యం ఉంటాయి. అభినవ తిమ్మరుసు లాంటి ఆయన పరిపాలనా అనుభవం తోడైతే ఈ అభినవ కృష్ణరాయల కత్తికి ఎదురుండదు. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందనా!
Disclaimer:
చేయి చాచిన వ్యక్తి : “అన్నయ్యా! ఈ నల్లనయ్య ఎవరు?”
మెగాస్టార్ చిరంజీవి: “నేనంటే వల్లమాలిన ఇష్టం కల ఓ అభిమాని, తమ్ముడూ!”
*దేశమంటే పార్టీ కాదోయ్…దేశమంటే మనుషులోయ్!”
*ఆంధ్రసీమ – స్వకపోలకల్పితం.
{భగవద్గీత: సాంఖ్య యోగం లోని శ్లోకాలు, మొదటి చిత్రం-తెవికీ నుంచి.
రెండవ చిత్రం: ఎయిడ్స్ డే, డిసెంబరు 1, 2003 న రవీంద్రభారతిలో }

WordPress.com లో Blog పెట్టుము.